
కరాచీ: టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్పై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో వరల్డ్ క్లాస్ బౌలరని కొనియాడిన కనేరియా అప్కమింగ్ ఆసియాకప్తో పాటు టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయాలని టీమిండియాకు సూచించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన అర్షదీప్ సింగ్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్తో టీమిండియా పిలుపు అందుకున్న అతను ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.
అరంగేట్ర మ్యాచ్లో 18 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత పొత్తి కడుపు గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న అర్ష్దీప్ సింగ్.. గాయం కారణంగానే తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇక బుధవారం జరిగే చివరి వన్డేలో అతనికి అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలోనే అర్ష్దీప్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన కనేరియా.. అతన్ని జట్టులోకి తీసుకోవాలన్నాడు.

'వెస్టిండీస్తో మూడో వన్డేలో అర్ష్దీప్ ఆడనున్నాడు. అవకాశం లభిస్తే మాత్రం ఈ మ్యాచ్లో అతను సత్తా చాటుతాడు. అర్ష్దీప్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అదే విధంగా అతడు చాలా తెలివిగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను ఎలా కట్టిడి చేయాలో అతనికి బాగా తెలుసు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో అతనికి చోటివ్వాలి. ఆసియా కప్ యూఏఈ వేదికగా జరుగుతోంది. అక్కడి పిచ్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. కాబట్టి అర్ష్దీప్ అద్భుతంగా రాణించగలడు'అని కనేరియా అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం టీమిండియాలో తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ప్లేస్కు ముగ్గురేసి ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్లతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్లు పోటీపడుతున్నారు. ఒకవేళ అర్షదీప్ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసిన తుది జట్టులో ఆడించడం కష్టం.