న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిలానే అవకాశాలు ఇవ్వకుండా సంజూ శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సంజూ శాంసన్కు అవకాశాలు ఇవ్వకుండా బీసీసీఐ, సెలెక్టర్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించాడు. న్యూజిలాండ్ పర్యటనలో తొలి వన్డే ఆడిన పర్వాలేదనిపించిన సంజూ శాంసన్ను రెండో వన్డేకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం పక్కనపెట్టడాన్ని తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ అంశంపై మాట్లాడిన కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అంబటి రాయుడు కెరీర్ కూడా ఇలానే ముగిసింది. అతను చాలా పరుగులు చేసినా..అవకాశాలు అందుకోలేకపోయాడు. బీసీసీఐ, సెలెక్షన్ కమిటీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. ఆటగాళ్లపై సెలెక్టర్లకు ఉన్న ఇష్టం, అయిష్టంతో ఇలా చేశారు. 'అని కనేరియా పేర్కొన్నాడు. ఐపీఎల్ 2018లో దుమ్మురేపిన అంబటి రాయుడు టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా అతన్ని నాలుగో స్థానంలో ఆడించేందుకు టీమ్మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో అతను అద్భుతంగా రాణించాడు. కానీ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం రాయుడిని కాదని విజయ్ శంకర్ను ఎంపిక చేసింది. తీరా అతను దారుణంగా విఫలమవ్వడంతో ఫైనల్ చేరకుండా టీమిండియా ఇంటిదారిపట్టింది.
ఇప్పుడు కూడా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం సంజూ శాంసన్ను పక్కనపెడుతున్నారు. అయితే సంజూ శాంసన్కు అవకాశాలు ఇవ్వకపోతే టీమిండియా ఓ మంచి ప్లేయర్ను కోల్పోతుందని కనేరియా హెచ్చరించాడు. 'ఓ ఆటగాడు ఎంత తట్టుకోగలడు? సంజూ శాంసన్ ఇప్పటికే చాలా భరించాడు. అవకాశం ఇచ్చినప్పుడల్లా రాణించాడు. సెలెక్టర్లు అవకాశం ఇవ్వకుండా ఇలానే టార్చర్ చేస్తే టీమిండియా ఓ మంచి ప్లేయర్ను కోల్పోతుంది. ప్రతి ఒక్కరూ సంజూ ఆడే కవర్, ఎక్స్ట్రా కవర్ షాట్లను చూడాలనుకుంటారు. ముఖ్యంగా అతను ఆడే పుల్ షాట్స్ అద్భుతంగా ఉంటాయి'అని కనేరియా చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్లో పర్యటనలో వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ను కొనసాగిస్తున్న టీమిండియా.. సంజూకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో టీమ్మేనేజ్మెంట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.