ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. తర్వాత వర్షం రావడంతో సన్రైజర్స్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ జట్టు వైఫల్యానికి గల కారణాలను చెప్పాడు. ఈ సీజన్ తమకు కలిసి రాలేదన్నాడు. హోమ్ గ్రౌండ్ పరిస్థితులు భిన్నంగా ఉండటం, నిలకడగా రాణించకపోవడం, బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం.. పిచ్లను సరిగ్గా అంచనా వేయకపోవడం ఈ సీజన్లో తమ పతనాన్ని శాసించాయని వెటోరి తెలిపాడు.

'ఈ ఏడాది ఉప్పల్ గ్రౌండ్ పరిస్థితులు మేం ఊహించిన విధంగా లేవు. గతేడాది ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఈ సారి పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు సహకరించాయి. ఇది మా బ్యాటింగ్ శైలికి ప్రతికూలంగా మారింది. అదే సమయంలో స్పిన్నర్లకు సహకరించలేదు. కొత్త బంతిని కొట్టడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. సమష్టిగా రాణించడంలోనూ విఫలమయ్యాం. నిలకడైన ప్రదర్శన చేయలేకపోయాం.
పిచ్ కండిషన్స్ను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఏ రోజు ఏ తరహా ఆట అవసరమో తెలుసుకొని ఆడలేకపోయాం. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయాం. గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. ఈ సీజన్లో నిలకడగా ఆడలేకపోయారు. ముఖ్యంగా స్పిన్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పేస్ విభాగం కొన్ని మ్యాచ్ల్లో రాణించినప్పటికీ.. నిలకడ కనబర్చలేదు. కొన్ని మ్యాచ్ల్లో కీలక క్యాచ్లు చేజార్చడం విజయవకాశాలు దెబ్బతీసింది. ఢిల్లీతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వర్షం అడ్డంకిగా మారింది. మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఢిల్లీని 133 పరుగులకే కట్టడి చేసింది. కానీ వర్షం మా ఆశలపై నీళ్లు చల్లింది. మహమ్మద్ షమీకి ఈ సీజన్ చాలా కష్టంగా గడిచింది. కానీ అతను మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాడు.'అని వెటోరి చెప్పుకొచ్చాడు.