సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరిగిన రెండో టెస్ట్ పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేప్టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసింది. అనూహ్యమైన బౌన్స్ వల్ల బ్యాటర్లు తెగ్గ ఇబ్బంది పడ్డారు. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ.. మూడో ఇన్నింగ్స్లో ఎయిడెన్ మార్క్రమ్ మాత్రమే సాధికారికంగా బ్యాటింగ్ చేశారు.
దాంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా ఇది చరిత్రకెక్కింది. ఈ క్రమంలోనే ఈ పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పిచ్ కండిషన్స్ను ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా, బ్రిటిష్ మీడియాతో పాటు సేనా దేశాల మాజీ క్రికెటర్లపై విమర్శలు గుప్పించాడు.

భారత స్పిన్ పిచ్ల గురించి ఎవరూ నోరు మెదపనంత కాలం ఇలాంటి పిచ్ల పై ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. పేస్ పిచ్ల్లానే స్పిన్ పిచ్లపై ఆడటాన్ని కూడా సవాల్గా భావించాలని సూచించాడు. భారత్లో తొలి రోజే పిచ్పై ఉన్న పగుళ్లను చూసి భయపడవద్దని సేనా దేశాల ఆటగాళ్లకు రోహిత్ హితవు పలికాడు.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ స్పందించాడు. కేప్టౌన్ పిచ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన అతను.. స్పిన్ పిచ్లపై ఆడేందుకు తమకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశాడు.
'పిచ్పై క్రాక్స్ వస్తే మేం ఎందుకు భయపడతాం? సిడ్నీ, పెర్త్ పిచ్లను చూడండి. అక్కడా పిచ్పై పగుళ్లు వస్తాయి. వాటి మధ్య కారును కూడా పార్క్ చేయవచ్చు. అయినా ఆ పిచ్లపై జరిగే మ్యాచ్లు నాలుగు లేదా ఐదు రోజుల వరకు వెళ్తాయి. కనీసం ఒక్క పగులు లేకుండా మ్యాచ్ వేగంగా ముగియడం వల్ల ఎవరికి లాభం. సమయం గడిచేకొద్దీ పిచ్లో మార్పులు వస్తుండాలి. రెండో రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ను టెస్ట్ అని ఎలా అంటారు?'అని ఎక్స్వేదికగా స్టెయిన్ ప్రశ్నించాడు.
107 ఓవర్లలోనే ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ 1-1తో సమం చేసింది. సౌతాఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను సమం చేసిన టీమిండియా వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ను సమం చేసి ఈ పర్యటనను దిగ్విజయంగా ముగిసింది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది.