టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్పై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టులోనే అతను నిస్వార్థపరుడని, జట్టు అవసరాల కోసం ఆడుతాడని తెలిపాడు. వ్యక్తిగత కెరీర్ కోసం కాకుండా జట్టు కోసం ఆడుతాడని కొనియాడాడు. వన్డేల్లో రాహుల్ టాప్-3లో ఆడితే కచ్చితంగా సెంచరీ చేస్తాడని, కానీ అతను జట్టు అవసరాల కోసం మిడిలార్డర్లో ఆడుతున్నాడని చెప్పాడు.
సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ 60(56 బంతుల్లో), రెండో మ్యాచ్2లో 66 నాటౌట్(43 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో రాణించాడు. కేఎల్ రాహుల్ గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన డేల్ స్టెయిన్.. జట్టుకు తగ్గట్లు ఆడే మెచ్యూరిటీ అతనికి ఉందని చెప్పాడు. 'కేఎల్ రాహుల్కు ఎలా ఆడాలో బాగా తెలుసు. ఒకవేళ అతను టాప్-3లో బ్యాటింగ్ దిగితే.. కచ్చితంగా సెంచరీలు సాధించగలడు. కానీ ప్రస్తుతం అతను జట్టు కోసం ఆడుతున్నాడు.

మిడిలార్డర్లో ఎలాంటి పాత్ర పోషించాలో అతనికి తెలుసు. తొలి వన్డేతో పాటు రెండో వన్డేలోనూ అతను హాఫ్ సెంచరీలు చేశాడు. ఎప్పుడూ తగ్గాలో.. ఎప్పుడు వేగంగా ఆడాలనే విషయంపై అతనికి అవగాహన ఉంది. కెప్టెన్గా కూడా రాహుల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. తొలి వన్డేలో అతను జట్టును విజయపథంలో నడిపించాడు. రెండో మ్యాచ్లో జడేజాతో కలిసి దూకుడుగా ఆడాడు. ఫినిషింగ్ పాత్రలో అతను పరిణతితో వ్యవహరిస్తున్నాడు.'అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు వన్డేల్లో 83 ఇన్నింగ్స్ల్లో 49.50 సగటుతో 3128 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను చివరిసారిగా వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్పై సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో రాహుల్ కేవలం 64 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. రాంచీ వేదికగా తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది.