
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న కీలక సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. స్మృతి మంధాన(32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31 బంతుల్లో 7 ఫోర్లతో 44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. దాంతో ఇంగ్లండ్ ముందు భారత్ 165 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ (2/22) రెండు వికెట్లు తీయగా.. నాట్ సివర్(1/26), కాథరిన్ బ్రంట్ (1/30) చెరొక వికెట్ పడగొట్టారు.
ఓపెనర్ షెఫాలీ వర్మ (15) విఫలమైనా స్మృతి మంధానా ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఓవైపు షెఫాలీ నాన్స్ట్రైకర్కే పరిమితం చేసిన మంధాన వరుస బౌండరీలతో జోరు కనబర్చింది. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన మంధాన 23 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దాంతో తొలి వికెట్కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ధాటిగా ఆడే క్రమంలో షెఫాలీ వర్మ ఔటవ్వగా.. మరుసటి ఓవర్లో మంధాన వెనుదిరిగింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్తో జెమీమా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసింది. అయితే హర్మన్ ప్రీత్ను కెంప్ పెవిలియన్ చేర్చగా.. దీప్తి శర్మను చివరి ఓవర్లో బ్రంట్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చింది. పూజా వస్త్రాకర్ రనౌటవ్వగా.. ఆఖరి బంతికి జెమీమా బౌండరీ బాది భారీ స్కోర్ అందించింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. అయితే ఓపెనర్ సోఫియా డంక్లీ(19) దీప్తి ఔట్ చేయడంతో 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది.