
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి స్వర్ణం లభించింది. భారత్ ఆశాదీపం, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు ప్రదర్శనతో తొలి పసిడిని అందించింది. దాంతో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అత్యున్నత వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. శనివారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 201 కేజీల బరువెత్తిన మీరాబాయి చాను స్వర్ణం సొంతం చేసుకుంది.
స్నాచ్లో 88 కిలోల రికార్డు బరువెత్తిన మీరాబాయి చాను.. 90 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. తొలి ప్రయత్నంలో 84 కేజీలు, రెండో ప్రయత్నంలో 88 కిలోల బరువును మీరాబాయి అలవోకగా ఎత్తింది. ఇక క్లీన్ జర్క్లో తొలి ప్రయత్నంలోనే 109 కేజీల బరువెత్తి బంగారు పతకం ఖాయం చేసుకున్న మీరాబాయి చాను.. రెండో ప్రయత్నంలో 113 కీలోల బరువెత్తింది. ఇక మూడో ప్రయత్నంలో 115 కేజీల బరువెత్తడంలో విఫలమైంది. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో తొలిసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను ఆ టైటిల్ను నిలబెట్టుకుంది.
మార్టిషయస్కు చెందిన మారీ హనిత్రా 172 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్లో 76 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్లో 96 కిలోల బరువెత్తి సిల్వర్ మెడల్ ఖాయం చేసుకుంది. కెనడాకు చెందిన హన్నా కమిన్స్కీ 171 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. స్నాచ్లో 74 కేజీల బరువెత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్లో 97 కేజీలు ఎత్తి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.
అంతకుముందు వెయిట్లిఫ్టింగ్లోనే భారత్కు రెండు పతకాలు రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ సిల్వర్ మెడల్తో భారత్కు తొలి పతకాన్ని అందించాడు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం పురుషుల 61 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ పుజారి బ్రాంజ్ మెడల్ సాధించాడు. 269 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 118 కేజీల బరువు ఎత్తిన గురురాజ.. క్లీన్ అండ్ జెర్క్లో 153 కేజీలు ఎత్తాడు. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.