చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. కివీస్ స్టార్ పేసర్లు లాకీ ఫెర్గూసన్(3/49), ట్రెంట్ బౌల్డ్(2/36), మ్యాట్ హెన్రీ(2/56) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులే చేసింది.
బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహామ్(74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 40), టెయిలెండర్ మహ్మదుల్లా(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే లిటన్ దాస్(0) వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే లిటన్ దాస్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ తానిజ్ హసన్(16)ను ఫెర్గూసన్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 46 పరుగులే చేసింది.
ఆచితూచి ఆడిన మెహ్దీ హసన్(36)ను ఫెర్గూస్ ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే నజ్ముల్ షాంటో(7)ను గ్లేన్ ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈపరిస్థితుల్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో వికెట్కు 96 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసింది.
హాఫ్ సెంచరీకి చేరువైన షకీబ్ అల్ హసన్ను ఫెర్గూసన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ముష్ఫికర్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతన్ని మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే టౌహిడ్ హ్రిదయ్(13)ను బౌల్డ్ ఔట్ చేయగా.. టస్కిన్ అహ్మద్(4) సాంట్నర్ పెవిలియన్ చేర్చాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్(4)ను హెన్రీ పెవిలియన్ చేర్చగా.. మహ్మదుల్లా విలువైన పరుగులతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.