IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది.
బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బౌన్సర్.. రోహిత్ శర్మ కుడి చేతి మణికట్టుకు బలంగా తాకినట్లు సమాచారం. నొప్పితో విలవిలలాడిన రోహిత్ శర్మ ఫిజియోల సాయంతో ప్రాక్టీస్ను అర్ధాంతరంగా ఆపేసి వెళ్లిపోయాడు.

రోహిత్ శర్మ గాయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అతని గాయం తీవ్రతను బట్టి రోహిత్ శర్మ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇప్పటికే చీలమండ గాయంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. రోహిత్ కూడా దూరమైతే కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా ఆడాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా క్రిస్ గేల్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ శర్మ పది సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
ఇంగ్లండ్తో మ్యాచ్.. కెప్టెన్గా రోహిత్ శర్మకు వందో మ్యాచ్ కానుంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ శర్మ 47 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్లో హిట్ మ్యాన్ ఈ రికార్డులను అధిగమిస్తాడని అభిమానులు ఆశతో ఉన్నారు. ఈ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడన్న వార్తలు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ను కలవరపెడుతున్నాయి.
ఇక వరుసగా ఐదు విజయాలతో టీమిండియా ఊపు మీదుంటే.. ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది. బంగ్లాదేశ్పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లండ్.. అఫ్గాన్, సౌతాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖారారు కానుంది. మరోవైపు ఇంగ్లండ్ ఓడితే అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకోనుంది.