Gautam Gambhir slams online news portal: ఓ నేషనల్ మీడియా సంస్థపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్పై తాను అనని మాటలు అన్నట్లుగా కథనం ప్రచురించడంపై గంభీర్ మండిపడ్డాడు. ఈ కథనానికి సంబంధించి స్పష్టమైన ఆధారం చూపాలని లేకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.
సౌతాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఆడిన సెంచరీ ఇన్నింగ్స్ను అఫ్గానిస్థాన్పై ఆసీస్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో గంభీర్ పోల్చాడని సదరు మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.

గ్లేన్ మ్యాక్స్వెల్ స్థానంలో కోహ్లీ ఉంటే 195 పరుగుల దగ్గరి నుంచి సింగిల్స్ తీసుకునేవాడని, డబుల్ సెంచరీ కోసం ఆడేవాడని గంభీర్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు పేర్కొంది. మ్యాక్స్వెల్ కాబట్టి డబుల్ సెంచరీ కోసం చూడకుండా భారీ షాట్లు ఆడాడని గంభీర్ మెచ్చుకున్నట్లు రాసుకొచ్చింది. ఈ కథనాన్ని చూసి అవాక్కైన గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఎక్స్వేదికగా.. ఈ కథనం పోస్ట్ను రీట్వీట్ చేస్తూ ఏంటి ఈ చెత్త రాతలని మండిపడ్డాడు. 'ఏంటి ఈ చెత్త రాతలు. నేను ఏదైనా బహిరంగంగానే చెబుతాను. మీరు రాసిన ఈ కథనానికి ఆధారం ఇవ్వండి లేదా క్షమాపణలు చెప్పండి'అని గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వెబ్సైట్పై అభిమానులు మండిపడ్డారు.
దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన సదరు సంస్థ గౌతమ్ గంభీర్కు క్షమాపణలు తెలియజేసింది. ఆ కథనాన్ని తొలిగిస్తున్నట్లు కూడా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని తెలిపింది. ఇక విరాట్ కోహ్లీపై అవకాశం దొరికినప్పుడల్లా గంభీర్ విమర్శలు గుప్పిస్తాడు.
ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా ఈ ఇద్దరూ మైదానంలో గొడవపడ్డారు. 2014 ఐపీఎల్లోనూ ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కోహ్లీని విమర్శించే గంభీర్.. బాగా ఆడినప్పుడు ఆకాశానికి కూడా ఎత్తుకుంటాడు. కోహ్లీ ఆడే విధానాన్ని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలని సూచిస్తాడు. అదే సమయంలో కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కొనియాడుతాడు.