న్యూఢిల్లీ: పాకిస్థాన్ వికెట్ కమ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ చిక్కుల్లో పడ్డాడు. మైదానంలో నమాజ్ చేసి క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు ఫిర్యాదు అందింది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మెగా టోర్నీలో మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది, సామాజిక వేత్త మహమ్మద్ రిజ్వాన్పై ఐసీసీ ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ రిజ్వాన్ మైదానంలోనే నమాజ్ చేశాడు. ఇది క్రీడా స్పూర్తిని దెబ్బతీయడమే కాకుండా, ఇతర మతాల అభిమానులను రెచ్చగొట్టే పనేనని జిందాల్ తన ఫిర్యాదులో ప్రస్తావించాడు.

ఇక రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఇదే తొలిసారి కాదు. చాలా మ్యాచ్ల్లో ఇలా మైదానంలోనే నమాజ్ చేశాడు. 2021 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా భారత్తో జరిగిన మ్యాచ్లో కూడా రిజ్వాన్ ఇలానే ప్రవర్తించాడు.
ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంపై కూడా రిజ్వాన్ ట్విటర్ వేదికగా స్పందించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ ట్వీట్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా.. ఆ అధికారం తమకు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మైదానం బయట జరిగే విషయాలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని పేర్కొంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రమే ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పాకిస్థాన్ హోస్ట్ జైనాబ్ అబ్బాస్పై కూడా వినీత్ జిందాలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె భారత్కు వ్యతిరేకంగా విమర్శలు చేసిందని, హిందూ మతాన్ని కించపరిచేలా కామెంట్లు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నెదర్లాండ్స్, శ్రీలంకపై విజయం సాధించిన పాకిస్థాన్.. భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. తదుపరి మ్యాచ్ను అక్టోబర్ 20(సోమవారం)న ఆస్ట్రేలియాతో ఆడనుంది.