న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే టీమిండియా బౌలర్ల ప్రదర్శన అభిమానులను తెగ సంతోషపరుస్తోంది.
ఈ మ్యాచ్లో టీమిండియాకు చెందిన ఐదుగురు బౌలర్లు రెండేసి వికెట్లు తీసారు. జస్ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35), రవీంద్ర జడేజా(2/38)లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. రెండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్కు మాత్రమే వికెట్ దక్కలేదు.

అయితే భారత్ గెలిచిన 2011 వన్డే ప్రపంచకప్లోనూ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్కు చెందిన ఐదుగురు బౌలర్లు రెండేసి వికెట్లు పడగొట్టారు. 2023 వన్డే ప్రపంచకప్లోనూ పాకిస్థాన్తో భారత బౌలర్లు రెండేసి వికెట్లు పడగొట్టడంతో ఈ సారి కూడా టైటిల్ టీమిండియానే వరిస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
2011 వన్డే ప్రపంచకప్లో జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తలో రెండు వికెట్లు తీసారు. అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.