మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న నవీ ముంబైలో ప్రస్తుతం భారీ వర్షం పడుతుంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. టాస్ సమయానికి ముందు కాసేపు వర్షం గడువు ఇవ్వగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ వేయలేదు.
గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని ఆటకు సిద్దం చేసే ప్రయత్నాలు చేపట్టేలోపే భారీ వర్షం మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దాంతో అంపైర్లు ఈ మ్యాచ్ కటాఫ్ టైమ్ను రాత్రి 9.08 గంటలుగా నిర్ణయించారు. ఆ సమయంలోపు మైదానం సిద్దంగా ఉంటే 20 ఓవర్ల గేమ్ ఆడిస్తారు. అలా కుదరకుంటే మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేస్తారు.

దురదృష్టకరమైన విషయం ఏంటంటే రిజర్వ్ డే అయిన సోమవారం కూడా నవీ ముంబైలో వర్షం పడే ఛాన్స్ ఉంది. 55 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రిజర్వ్ డే కూడా వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల్లో డక్వర్త్ లూయిస్ పద్దతిన కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగేలా చూస్తారు. అలా కూడా సాధ్యం కానీ పరిస్థితుల్లోనే మ్యాచ్ను రద్దు చేసి సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
ఎన్నో అవమానాలు.. మరెన్నో అసౌకర్యాలను తట్టుకొని నిలబడిన భారత మహిళల జట్టు విశ్వ కిరీటాన్ని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. తన అర్ధశతాబ్దపు నిరీక్షణకు తెరదించేందుకు ఊవ్విళ్లూరుతోంది. పురుషుల క్రికెట్ రాతను మార్చిన 1983 తరహాలో వరల్డ్ కప్ విజయం మహిళల క్రికెట్కు మేలిమలుపుగా మారే ఘట్టం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. 11 ప్రపంచకప్లు ఆడిన భారత్ 2005, 2017లో తుది పోరుకు చేరినా.. తృటిలో టైటిల్ చేజారింది. ఈ సారైనా ఆ కల నెరవేరాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.