
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించారు. వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. మోయిన్ అలీ(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 48) సూపర్ బ్యాటింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మోయిన్ అలీకి అండగా అంబటి రాయుడు(27 బంతుల్లో 4 ఫోర్లతో 27), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 23) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రాబిన్ ఊతప్ప(15)ను వాషింగ్టన్ సుందర్ తన ఫస్ట్ ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్(16)ను నటరాజన్ సూపర్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో చెన్నై పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 41 రన్స్ చేసింది. ఈ పరిస్థితుల్లో అంబటి రాయుడు(27), మోయిన్ అలీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మూడో వికెట్కు 63 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీసాడు.

అంబటి రాయుడిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీకి చేరువైన మోయిన్ అలీ(48)ని మార్క్రమ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శివమ్ దూబేను నటరాజన్ ఔట్ చేయగా.. ధోనీని మార్కో జాన్సన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో చెన్నై 122 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్రావోతో కలిసి భారీ షాట్లు ఆడిన జడేజా(23).. అదే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో చెన్నై స్వల్ప స్కోర్కే పరిమితమైంది.