చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన జోరును కొనసాగిస్తున్నాడు. అసాధారణ బౌలింగ్తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడేజా.. తాజాగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
అది కూడా కీలకమైన దేవదత్ పడిక్కల్ వికెట్తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్లను బంతి వ్యవధిలోనే పెవిలియన్ చేర్చాడు. రవీంద్ర జడేజా స్టన్నింగ్ డెలివరీకి సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతికి పడిక్కల్ను క్యాచ్ ఔట్ చేసిన జడేజా.. 77 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే ఐదో బంతికి సంజూ శాంసన్ను డకౌట్ చేశాడు. జడేజా వేసిన క్వికర్ డెలివరీని అంచనా వేయడంలో విఫలమైన సంజూ శాంసన్.. బ్యాక్ ఫుట్లో ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
అనూహ్యంగా టర్న్ అయిన బంతి అతని హాఫ్ వికెట్ను లేపేసింది. జడేజా బౌలింగ్కు సంజూ శాంసన్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ మరుసటి బంతికి అశ్విన్ ఇచ్చిన క్యాచ్ను మొయిన్ అలీ నేలపాలు చేశాడు. లేకుంటే జడేజా ఖాతాలో మరో వికెట్ చేరేది.
మొత్తం నాలుగు ఓవర్లు వేసిన జడేజా 2 వికెట్లు తీసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది.
జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో డేవాన్ కాన్వేతో పాటు అజింక్యా రహానే ఉన్నారు.