ఐపీఎల్ 2025 సీజన్ను రాజస్థాన్ రాయల్స్ విజయంతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో ఆకాశ్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ రాణించగా.. బ్యాటింగ్లో 14 ఏళ్ల సూర్యవంశీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే(20 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 43), డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్(3/47) , ఆకాశ్ మధ్వాల్(3/29) మూడేసి వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వానిందు హసరంగా తలో వికెట్ పడగొట్టారు. మరోసారి ధోనీ జిడ్డు బ్యాటింగ్ సీఎస్కే భారీ స్కోర్ను అడ్డుకుంది.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 57), సంజూ శాంసన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 31 నాటౌట్), యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 36) రాణించారు. చెన్నై బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(2/41) రెండు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేశాడు. అయితే అతన్ని అన్షుల్ కంబోజ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. సంజూ శాంసన్తో కలిసి వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో అతను 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన సంజూ శాంసన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 41)ని అశ్విన్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో వైభవ్ సూర్యవంశీని కూడా ఔట్ చేసి ఆశలు రేకెత్తించాడు. రియాన్ పరాగ్(3)ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారుతుందని భావించారు. కానీ ధ్రువ్ జురెల్ విధ్వంసకర బ్యాటింగ్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. మూడు సిక్స్లు బాది మ్యాచ్ను ముగించాడు.