చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు మరో పరాజయం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సందీప్ శర్మ అసాధారణ బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ ఓటమి నుంచి గట్టెక్కింది. సీఎస్కే కెప్టెన్గా 200వ మ్యాచ్లో ధోనీకి నిరాశే ఎదురైంది.
చివరి మూడు బంతుల్లో చెన్నై విజయానికి 7 పరుగులే అవసరమవ్వగా.. సందీప్ శర్మ అద్భుతమైన యార్కర్లతో మూడు పరుగులే ఇచ్చి రాజస్థాన్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే(38 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. అజింక్యా రహానే(38), ధోనీ(17 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 32 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8)ను సందీప్ శర్మ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానేతో కలిసి డేవాన్ కాన్వే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ కాస్త ఆచితూచి ఆడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం సంజూ స్పిన్నర్లను రంగంలోకి దించగా.. చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెట్ అయిన అజింక్యా రహానేను అశ్విన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్లో శివమ్ దూబే(8)ను అదే రీతిలో పెవిలియన్ చేర్చగా.. మోయిన్ అలీని(7) ఆడమ్ జంపా క్యాచ్ ఔట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అంబటి రాయుడిని చాహల్ ఔట్ చేశాడు. దాంతో చెన్నై 15 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది.
మరోవైపు డేవాన్ కాన్వే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతన్ని చాహల్ ఔట్ చేశాడు. క్రీజులోకి ధోనీ, జడేజా రాగా.. చెన్నై విజయానికి 30 బంతుల్లో 63 పరుగులు అవసరమయ్యాయి.
ధోనీ ఓ సిక్సర్, ఫోర్ బాదగా.. జడేజా రెండు సిక్స్లతో పాటు బౌండరీ బాదడంతో ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు వైడ్లు వేసి తర్వాతి బంతిని డాట్ చేశాడు. తర్వాత వరుసగా రెండు సిక్స్లు బాదిన ధోనీ అనంతరం ఓ సింగిల్ తీసాడు.
దాంతో చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. జడేజా సింగిల్ తీసాడు. చివరి బంతికి కూడా సింగిలే రావడంతో రాజస్థాన్ విజయం లాంఛమైంది.