చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంది. మొయిన్ అలీ రెండు క్యాచ్లతో పాటు ఓ రనౌట్ మిస్ చేయగా.. తీక్షణ ఓ సునాయస క్యాచ్ను నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది.
జోస్ బట్లర్(36 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(38), అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే యశస్వీ జైస్వాల్(10)ను తుషార్ దేష్పాండే క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్తో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహీశ్ తీక్షణ వేసిన 5వ ఓవర్లో పడిక్కల్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో మొయిన్ అలీ చేజార్చాడు.
ఈ అవకాశంతో అతను ధాటిగా ఆడగా.. రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. మొయిన్ అలీ వేసిన 8వ ఓవర్లో బట్లర్ రెండు సిక్స్లు బాది 18 పరుగులు పిండుకున్నాడు. 77 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీసాడు. బంతి వ్యవధిలోనే పడిక్కల్(38), సంజూ శాంసన్(0)లను పెవిలియన్ చేర్చాడు.
పడిక్కల్ను క్యాచ్ ఔట్ చేసిన జడేజా.. సంజూ శాంసన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అశ్విన్.. స్లిప్లో క్యాచ్ ఇవ్వగా మరోసారి మొయిన్ అలీ నేలపాలు చేశాడు. మరోవైపు జోస్ బట్లర్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మొయిన్ అలీ తప్పిదంతో అశ్విన్ రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు.
ఈ అవకాశాలతో చెలరేగిన అశ్విన్ భారీ సిక్సర్లు బాదాడు. ఆకాశ్ సింగ్ ఎట్టకేలకు అశ్విన్(30)ను ఔట్ చేయగా.. బట్లర్ను మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ధృవ్ జురెల్(4), జాసన్ హోల్డర్(0) విఫలమవ్వగా.. ఆడమ్ జంపా సాయంతో షిమ్రాన్ హెట్మైర్(30 నాటౌట్) రాజస్థాన్కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.