ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆర్సీబీ గెలుపొందింది. పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2008 తర్వాత చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆర్సీబీ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫిల్ సాల్ట్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. చివర్లో టీమ్ డేవిడ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

సీఎస్కే కొంపముంచిన చెత్త ఫీల్డింగ్..
సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్(3/36) మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు. చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ఫీల్డింగ్ ఆర్సీబీకి కలిసొచ్చింది. రజత్ పటీదార్ ఇచ్చిన మూడు క్యాచ్లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు.
అనంతరం సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర(31 బంతుల్లో 5 ఫోర్లతో 41), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), యశ్ దయాల్(2/18), లియమ్ లివింగ్ స్టోన్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/20) ఓ వికెట్ పడగొట్టాడు.
దెబ్బతీసిన హజెల్ వుడ్..
లక్ష్య చేధనలో సీఎస్కే ఆశించిన శుభారంభం దక్కలేదు. జోష్ హజెల్వుడ్ ఒకే ఓవర్లో రాహుల్ త్రిపాఠి(5)తో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా(4)ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేయడంతో సీఎస్కే బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సీఎస్కే 3 వికెట్లకు 30 పరుగులే చేసింది. ఈ సీజన్లోనే ఇది లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్. అనంతరం రచిన్ రవీంద్ర బౌండరీలతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఎండ్లో సామ్ కరణ్(8)ను లివింగ్ స్టోన్ పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే భారీ సిక్స్ బాదాడు. స్పిన్నర్లను అలవోకగా ఆడుతుండటంతో.. యశ్ దయాల్ను రంగంలోకి దింపిన రజత్ పటీదార్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. క్రీజులో సెట్ అయిన రచిన్ రవీంద్ర(41)తో పాటు, శివమ్ దూబే(19)లను ఒకే ఓవర్లో యశ్ దయాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సీఎస్కే ఓటమి ఖాయమైంది. అశ్విన్(11) సైతం నిరాశపరిచాడు. లివింగ్ స్టోన్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
ధోనీ మెరుపులు..
బ్యాటింగ్కు వచ్చిన ధోనీ.. జడేజాతో కలిసి బౌండరీలు బాదాడు. జడేజా సైతం తనదైన షాట్లతో అలరించాడు. కానీ అతన్ని జోష్ హజెల్ వుడ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్లో ధోనీ వరుసగా రెండు సిక్స్లు బాదడంతో పాటు ఓ బౌండరీ బాది అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్లో సీఎస్కే ఓడినా.. ధోనీ బ్యాటింగ్ను ఆ జట్టు అభిమానులు ఆస్వాదించారు.