ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తన కీపింగ్ మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాడు. ఆర్సీబీతో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ధోనీ కళ్లు చెదిరే స్టంపౌట్ చేశాడు. అతని కీపింగ్ మాయాజాలానికి ఆర్సీబీ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 0.14 సెకన్ల వ్యవధిలోనే ధోనీ ఈ స్టంపౌట్ చేయడం విశేషం. నూర్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ఐదో బంతిని నూర్ అహ్మద్ గూగ్లీ వేయగా.. ఫిల్ సాల్ట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ను మిస్సైన బంతి కీపర్ ధోనీ చేతిలో పడింది. అతను వెంటనే వికెట్లను పడేసాడు. డ్రైవ్ ఆడే ప్రయత్నంలో ఫిల్ సాల్ట్.. బ్యాక్ఫుట్ను గాల్లో ఉంచాడు. దాంతో స్టంపౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ స్టంపౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లోనూ ధోనీ.. ఇలానే రెప్ప పాటు సమయంలో సూర్యకుమార్ యాదవ్ను స్టంపౌట్ చేసాడు. 0.12 సెకన్లలోనే సూర్యను స్టంపౌట్ చేయడం గమనార్హం.

అద్భుతమైన వికెట్ కీపింగ్తో ఆకట్టుకుంటున్న ధోనీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోనీ కీపర్గా ఉన్నప్పుడు.. క్రీజు ధాటితే స్టంపౌటేనని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. ఫిల్ సాల్ట్.. తన ఫామ్ను కొనసాగిస్తూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో తొలి వికెట్కు 45 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) దూకుడుగా ఆడాడు. కానీ అతన్ని అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు విరాట్ కోహ్లీ(14 బ్యాటింగ్), రజత్ పటీదార్(3 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.