ఐపీఎల్ 2024 సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో చెన్నై వేదికగా జరిగిన సీజన్ ఓపెనర్లో సమష్టిగా రాణించిన సీఎస్కే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోవైపు పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో ఆర్సీబీ ఓటమిని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48), వెటరన్ కీపర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్కు 95 పరుగులు జోడించారు.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37), శివమ్ దూబే(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 38 నాటౌట్), రవీంద్ర జడేజా(17 బంతుల్లో సిక్స్తో 25 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో కామెరూన్ గ్రీన్(2/27) రెండు వికెట్లు తీయగా.. కర్ణ్ శర్మ, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు.
చెపాక్ మైదానంలో ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతోంది. 2008 సీజన్ చివరి సారిగా గెలిచిన ఆ జట్టు.. మళ్లీ విజయాన్ని అందుకోలేదు.
చెలరేగిన రచిన్..
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(15)ను ఆర్సీబీ ఇంపాక్ట్ బౌలర్ యశ్ దయాల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రహానేతో రచిన్ రవీంద్ర చెలరేగాడు. భారీ సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రహానే సైతం దూకుడుగా ఆడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న రచిన్ రవీంద్రను కర్ణ్ శర్మ ఔట్ చేయగా.. రహానేను కామెరూన్ గ్రీన్ స్లో బౌన్సర్తో బోల్తా కొట్టించాడు. 2 సిక్స్లతో దూకుడు కనబర్చిన డారిల్ మిచెల్(22)ను గ్రీన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో శివమ్ దూబే ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ బౌలర్లు అనవసర తప్పిదాలు చేశారు. వైడ్స్, ఓవర్త్రోలతో అదనపు పరుగులు ఇచ్చారు. చివర్లో మరింత ధాటిగా ఆడిన శివమ్ దూబే విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.