చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద రహానే పట్టిన సూపర్ స్మార్ట్ క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. రహానే తెలివికి ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని విరాట్ కోహ్లీ.. డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా.. అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న రహానే కుడి వైపు పరుగెత్తి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద సమన్వయం కోల్పోయిన అతను.. వెనుకాలే బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరుగెత్తుకొచ్చిన రచిన్ రవీంద్రకు తెలివిగా బంతిని అందించాడు. దాంతో కోహ్లీ క్యాచ్ రచిన్ ఖాతాలో చేరింది. రహానే తెలివికి చెన్నై ఆటగాళ్లంతా ఫిదా అయ్యారు. కోహ్లీ మాత్రం నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ ప్లేయర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48), వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
విరాట్ కోహ్లీ(20 బంతుల్లో సిక్స్తో 21), రజత్ పటీదార్(0), గ్లేన్ మ్యాక్స్వెల్(0), కామెరూన్ గ్రీన్(18) తీవ్రంగా నిరాశపరిచారు. సీఎస్కే పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ధాటికి 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 100 పరుగులైనా చేస్తుందా? అని అంతా అనుకున్నారు. కానీ అనూజ్ రావత్ సంచలన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. మూడు భారీ సిక్స్లతో ఇన్నింగ్స్ను గాడినపెట్టాడు. కార్తీక్ సైతం అతనికి అండగా నిలవడంతో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 95 పరుగులు జోడించారు.