
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన మార్క్ కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కళ్లు చెదిరే రనౌట్తో ఔరా అనిపించాడు. మహీ రనౌట్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ భానుక రాజపక్స(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
క్రిస్ జోర్డాన్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన భానుక రాజపక్స.. అదే జోరులో బౌలర్ వేసిన లెంగ్త్ బాల్ను లెగ్ సైడ్ ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. నాన్ స్ట్రైకర్లో ఉన్న శిఖర్ ధావన్ సైతం రన్ కోసం మూమెంట్ ఇవ్వగా.. రాజపక్స హాఫ్ పిచ్ ధాటేసాడు. కానీ బంతి బౌలర్కు సమీపించిందని గ్రహించి ధావన్ యూటర్న్ తీసుకోగా.. రాజపక్స సైతం వెనక్కి పరుగెత్తే ప్రయత్నం చేశాడు.
అయితే బంతిని అందుకునన జోర్డాన్ వికెట్ల వైపు విసరగా.. అది మిస్సై ధోనీ చేతిలో పడింది. అయితే ధోనీ సూపర్ డైవ్ చేస్తూ స్టంప్స్ను పడగొట్టి రనౌట్ చేశాడు. ఈ రనౌట్ ఒకప్పటి ధోనీని తలపిస్తుండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 'సూపర్ ధోనీ.. అద్భుతంగా రనౌట్ చేశావు' అంటూ కొనియాడుతున్నారు. ఇంకొందరేమో ధోనీకి వయసు అయిపోయిందన్నది ఎవరైనా.. ఫిట్టెస్ట్ క్రికెటర్లా చెలరేగుతుంటేనని కామెంట్ చేస్తున్నారు. మరో తెలుగు నెటిజన్.. డీజే టిల్లు సినిమాలోని పాపులర్ డైలాగ్తో ఫన్నీగా.. ఎవడు రాధికా ధోనీకి వయసు అయిపోయిందన్నది? ఈ రనౌట్ చూసి మాట్లాడమను.. అని కామెంట్ చేసాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 60) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు. లివింగ్ స్టోన్ విధ్వంసంతో 200 ప్లస్ పరుగులు చేస్తుందనుకున్న పంజాబ్.. ఆఖర్లో చెన్నై బౌలర్లు చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.