
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపరం కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ పేలవ బ్యాటింగ్తో చెన్నై 54 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్లోకి కొత్తగా వచ్చిన వైభవ్ అరోరా(2/21) తన సూపర్ బౌలింగ్తో చెన్నైని కోలుకోలేని దెబ్బ తీసాడు. ఔటాఫ్ సిలబస్లో దూసుకొచ్చిన ఈ యంగ్ పేసర్ను ఎదుర్కోలేక చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్కు ముందే వైభవ్ ఇన్ స్వింగర్తో పాటు ఔట్ స్వింగర్ వేయగలడని, అతనిపై భారీ అంచనాలున్నాయని పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ చెప్పాడు. ఇక తమ కెప్టెన్ అంచనాలను నిజం చేస్తూ వైభవ్ చెలరేగాడు. పంజాబ్ అద్భుత విజయంలో కీలక పాత్రపోషించాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 60) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్(33), జితేశ్ శర్మ(26) రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై.. 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో వైభవ్ అరోరా, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టాడు. రబడా, స్మిత్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసారు.
181 పరుగుల లక్ష్యచేధనకు దిగిన చెన్నైకి రబడా ఆరంభంలోనే షాకిచ్చాడు. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(1)ను పెవిలియన్ చేర్చాడు. వైభవ్ అరోరా తన వరుస ఓవర్లలో రాబిన్ ఊతప్ప(13), మొయిన్ అలీ(0)లను పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా మొయిన్ అలీని గోల్డెన్ డకౌట్గా వెనక్కిపంపడం పంజాబ్కు కలిసొచ్చింది. ఈ మూడు వికెట్లు వెనువెంటనే కోల్పోవడంతో చెన్నై తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ వెంటనే రాయుడు(13)ని ఓడియన్ స్మిత్.. జడేజా(0)ను అర్షదీప్ సింగ్ ఔట్ చేయడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, ధోనీ పోరాడినా ఫలితం లేకపోయింది. చివర్లో రాహుల్ చాహర్ విజృంభించడంతో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. వైభవ్ అరోరా తీసిన రెండు కీలక వికెట్లు మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయి.