
దుబాయ్: బ్యాటింగ్కు ప్రతికూలమైన పిచ్పై ఫాఫ్ డుప్లెసిస్(55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 76) ఒంటరి పోరాటం చేయడంతో పంజాబ్ కింగ్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఐపీఎల్ 2021 సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. వికెట్ నుంచి లభించిన సహకారాన్ని పంజాబ్ బౌలర్లు సమష్టిగా రాణించారు.
ఓ దశలో 61 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ డుప్లెసిస్ ధాటిగా ఆడి జట్టుకు కనీసం పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, షమీ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ తన వరుస ఓవర్లలో సూపర్ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(12), మోయిన్ అలీ(0)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో పవర్ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(2)ను క్రిస్ జోర్డాన్ బోల్తా కొట్టించాడు. అతని బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఊతప్ప పేలవ షాట్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు.
ఇక తన మరుసటి ఓవర్లో అంబటి రాయుడిని క్రిస్ జోర్డాన్ ఔట్ చేయగా.. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మహేంద్ర సింగ్ ధోనీని రవి బిష్ణోయ్ బోల్డ్ చేశాడు. దాంతో చెన్నై 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి ఫాఫ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఓవైపు జడ్డూ డిఫెన్స్కే పరిమితమవ్వగా.. మరోవైపు డుప్లెసిస్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్ ఆ తర్వాత మరింత చెలరేగాడు. మహమ్మద్ షమీ వేసిన చివరి ఓవర్లో 4, 6 బాదిన డుప్లెసిస్.. ఆ మరుసటి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం డ్వేన్ బ్రావో భారీ సిక్సర్ బాదడంతో చెన్నై స్కోర్ 130 పరుగుల మార్క్ను అందుకుంది.