చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సికిందర్ రాజా(13 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో పంజాబ్ ఆఖరి బంతికి విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(52 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(37), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, సామ్ కరణ్, రాహుల్ చాహర్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(42), లియామ్ లివింగ్ స్టోన్(40) రాణించారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ పతీరణకు ఓ వికెట్ దక్కింది. 19వ ఓవర్లో తుషార్ దేశ్పాండే 13 పరుగులు ఇవ్వడం చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది.
ఓపెనర్ల శుభారంభం.. :భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(28) శుభారంభం అందించారు. ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. 50 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తుషార్ దేశ్పాండే విడదీసాడు. శిఖర్ ధావన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి అథర్వ టైడే(13) రాగా.. ప్రభ్ సిమ్రాన్ బౌండరీలు బాదాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
జడేజా దెబ్బకొట్టినా.. :పవర్ ప్లే అనంతరం ధోనీ.. స్పిన్నర్ జడేజాను రంగంలోకి దింపి ఫలితం రాబట్టాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ప్రభుసిమ్రాన్ను స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అథర్వను జడేజా రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ 94 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కరణ్(29) జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 57 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని తుషార్ దేశ్పాండే విడదీసాడు.
లియామ్ లివింగ్స్టోన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే సామ్ కరణ్ను పతీరణ ఔట్ చేయగా.. జితేశ్ శర్మ భారీ షాట్లతో ఆశలు రేకెత్తించాడు. అయితే సబ్స్టిట్యూట్ ఫీల్డర్, తెలుగు తేజం షేక్ రషీద్ సూపర్ క్యాచ్కు జితేశ్ శర్మ(21) వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజా బౌండరీ బాదడంతో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి. పతీరణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి బంతికి మూడు పరుగులు అవసరమయ్యాయి. కానీ సికిందర్ రాజా సూపర్ షాట్ ఆడి మూడు పరుగులు తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.