ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లతో 2 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్(2/17), రాహుల్ చాహర్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. వరుస బంతుల్లో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయడం.. సమీర్ రిజ్వీ జిడ్డు బ్యాటింగ్, రాహుల్ చాహర్ సంచలన బౌలింగ్ చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసాయి.

శుభారంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం నిలకడగా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు హర్ప్రీత్ బ్రార్ బిగ్ షాకిచ్చాడు.
వరుస బంతుల్లో అజింక్యా రహానే(24)తో పాటు శివమ్ దూబే(0)లను పెవిలియన్ చేర్చాడు. రహానేను క్యాచ్ ఔట్ చేసిన హర్ప్రీత్ బ్రార్.. శివమ్ దూబేను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి సమీర్ రిజ్వీ రాగా.. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సమీర్ రిజ్వీ జిడ్డు బ్యాటింగ్..
పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ జోడీ సింగిల్స్కే పరిమితమైంది. దాంతో సీఎస్కే పరుగుల వేగం తగ్గింది. జిడ్డు బ్యాటింగ్తో విసిగించిన సమీర్ రిజ్వీ(21)ని రబడా క్యాచ్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ దూకుడు కనబర్చాడు. మరోవైపు గైక్వాడ్ సైతం బ్యాట్కు పనిచెప్పడంతో సీఎస్కే స్కోర్ బోర్డు పరుగెత్తింది.
దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ను అర్ష్దీప్ సింగ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి ధోనీ రాగా.. మోయిన్ అలీని రాహుల్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 19వ ఓవర్లో చాహర్ 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీసాడు. ఆఖరి ఓవర్లో ధోనీ 6, 4 బాది 13 పరుగులు పిండుకున్నాడు.