చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ తన జోరును కొనసాగిస్తున్నాడు. తనకే సాధ్యమైన హిట్టింగ్తో అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా.. ఆడిన రెండు, మూడు బంతులనే భారీ సిక్సర్లుగా మలుస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ చివర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ.. నాలుగు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాది తనదైన శైలిలో ఇన్నింగ్స్ను ముగించాడు.
సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను వరుసగా సిక్సర్లు బాదాడు. ధోనీ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ధోనీ ఫినిషింగ్ టచ్ ఎట్టా ఉంటాదో తెలుసా? అని కామెంట్ చేస్తున్నారు. ఫినిషింగ్ కా బాప్ ధోనీ అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(52 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(37), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, సామ్ కరణ్, రాహుల్ చాహర్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 94 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(42), శిఖర్ ధావన్(28) శుభారంభం అందించినా క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 50 పరుగులు జోడించగా.. తుషార్ దేశ్ పాండే విడదీసాడు. శిఖర్ ధావన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ఆ వెంటనే హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ను జడేజా ఔట్ చేశాడు. అథర్వ తైడే(13) ఔటవ్వగా.. లియామ్ లివింగ్స్టోన్, సామ్ కరణ్ విజయం కోసం పోరాడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 3 వికెట్లకు 129 పరుగులు చేసింది.