చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. విధ్వంసకర బ్యాటింగ్తో మరోసారి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. ఓపెనర్ డేవాన్ కాన్వే(52 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 2 సిక్సర్లతో 13 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో జట్టు స్కోర్ను 200 మార్క్ను ధాటించాడు. తనదైన శైలిలో ఆఖరి బంతిని సిక్స్గా మలిచి ఇన్నింగ్స్ను ముగించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, సామ్ కరణ్, రాహుల్ చాహర్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(37), డేవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 86 పరుగులు జోడించారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సికిందర్ రాజా విడదీసాడు. రుతురాజ్ గైక్వాడ్ను స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(28) ధాటిగా ఆడాడు. 2 భారీ సిక్సర్లతో జోరు కనబర్చిన అతన్ని అర్ష్దీప్ సింగ్ ఔట్ చేయగా.. డేవాన్ కాన్వే 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శివమ్ దూబే వికెట్ అనంతరం మొయిన్ అలీ(10), రవీంద్ర జడేజా(12) ధాటిగా ఆడే క్రమంలోనే వెనుదిరిగారు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు డేవాన్ కాన్వే ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు.
చివరి ఓవర్లో ధోనీ అతనికి స్ట్రైకింగ్ ఇచ్చినా సింగిలే తీయడంతో సెంచరీ అందుకోలేకపోయాడు. మరోవైపు నాలుగు బంతులు ఆడిన ధోనీ రెండు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్ను ముగించాడు.