ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో వాంఖడే మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మతీష పతీరణ(4/28) సంచలన బౌలింగ్తో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 105 నాటౌట్) శతక్కొట్టగా.. తిలక్ వర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ(4/28) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ తీసారు.
అదిరిపోయే ఆరంభం..
207 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
రోహిత్ విధ్వంసం..
ఈ పరిస్థితుల్లో మతీష పతీరణ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్(23), సూర్యకుమార్ యాదవ్(0)లను పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్ వద్ద ముస్తాఫిజుర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కు సూర్య ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి రోహిత్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా బౌలింగ్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్పై తుషార్ దేశ్ పాండే నేలపాలు చేశాడు.
నిప్పులు చెరిగిన పతీరణ..
61 పరుగుల వద్ద లభించిన ఈ లైఫ్తో రోహిత్ చెలరేగాడు. మరోవైపు తిలక్ వర్మ సైతం మెరుపులు మెరిపించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని పతీరణ విడదీసాడు. తిలక్ వర్మను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 4వ వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన టీమ్ డేవిడ్ భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. రోమారియో షెఫర్డ్(1)ను పతీరణ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ముంబై విజయానికి 12 బంతుల్లో 47 పరుగులు అవసరమవ్వగా.. ముస్తిఫిజుర్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేసి 13 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో బౌండరీ బాదిన రోహిత్ 61 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో తన సెంచరీని రోహిత్ సెలెబ్రేట్ చేసుకోలేదు.