
హైదరాబాద్: కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సందడి మళ్లీ మొదలైంది. దుబాయ్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన రసవత్తర షురూతో ధనాధన్లీగ్కు తెరలేచింది. మరో 25 రోజుల పాటు అభిమానులను టీవీలకు కట్టిపడేయనుంది. ఇక ఐపీఎల్ రెండో దశ లీగ్కు ఆసక్తికర ఆరంభం లభించింది. విపత్కర పరిస్థితుల్లో నుంచి తేరుకుంటూ చెన్నై సూపర్ కింగ్స్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. 24కే 4 వికెట్లు కోల్పోయినా, రుతురాజ్ అద్భుత పోరాటంతో పోటీ ఇవ్వగలిగే స్కోరు సాధించిన సూపర్కింగ్స్.. కట్టుదిట్టమైన బౌలింగ్తో పటిష్ట ముంబైకి కళ్లెం వేసింది. చెన్నై ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది.
ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ టీఆర్పీ రేటింగ్స్లో రికార్డులు సృష్టించింది. మ్యాచ్ అనేక మలుపులు తిరగడంతో ప్రేక్షకులు టీవీ, మొబైల్లకు అతుక్కుపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఆదివారం కావడం, రెండు బలమైన జట్ల మధ్య పోరు కావడంతో ప్రేక్షాకాదరణ డబుల్ అయింది.
మాములుగా ఐపీఎల్ మ్యాచ్ జరిగితే డిస్నీ+హాట్ స్టార్లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. కానీ ఆదివారం మ్యాచ్ ఆరంభమైన తర్వాత హాట్స్టార్లో వీక్షకుల సంఖ్య 40 లక్షలు ధాటింది. ఓ దశలో ఈ సంఖ్య 50 లక్షలను కూడా క్రాస్ చేసింది. టీఆర్పీ రేటింగ్స్లో కూడా స్టార్ స్పోర్ట్స్ దుమ్మురేపింది. గతానికి భిన్నంగా మెరుగైన రికార్డు సాధించింది. అన్నీ భాషల్లో అందుబాటులో ఉండటం.. పైగా ఆయా రాష్ట్రలకు చెందిన క్రికెటర్లను కామెంటేటర్లుగా ఎంచుకోవడంతో పాటు ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ కార్యక్రమాలను నిర్వహించడం స్టార్ స్పోర్ట్స్కు కలిసొచ్చింది. చానెల్ మార్చకుండా చూసేలా చేసింది. రాను రాను ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.