దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. రెండు బలమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఆఖరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ వశమైంది. రుతురాజ్ గైక్వాడ్ విరోచిత ఇన్నింగ్స్కు డ్వేన్ బ్రావో ఆల్రౌండ్ షో తోడవ్వడంతో 20 పరుగుల తేడాతో పటిష్ట ముంబైని చిత్తు చేసింది. ఫలితంగా ఫస్టాఫ్ సీజన్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి అండగా రవీంద్ర జడేజా(26), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 3 సిక్సర్లతో 23) రాణించారు. 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రుతురాజ్-జడేజా ఐదో వికెట్కు 81 పరుగులు జోడించి గట్టెక్కించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. సౌరభ్ తివారి(40 బంతుల్లో 50 నాటౌట్) మినహా ఎవరూ రాణించలేదు. ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్(3), ఇషాన్ కిషన్(11), కీరన్ పొలార్డ్(15), కృనాల్ పాండ్యా(4), అన్మోల్ ప్రీత్ సింగ్(16) తీవ్రంగా నిరాశపరిచారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో(3/25) మూడు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. మహేంద్రుడి మార్క్ కెప్టెన్సీకి ముంబై ఇండియన్స్ ఉక్కిరి బిక్కిరి అయింది.