ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 108 నాటౌట్) విధ్వంసకర శతకంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది.
అతనికి తోడుగా శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 66) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్కు రహానే ఔటవ్వగా.. డారిల్ మిచెల్(11)ను యష్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి కెప్టెన్ గైక్వాడ్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ కొద్దిసేపటికే రవీంద్ర జడేజా(17)ను మోహ్సిన్ ఖాన్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు శివమ్ దూబే భారీ సిక్స్లు బాదడంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగెత్తింది.
ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే శివమ్ దూబే 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ చెన్నై స్కోర్ను 200 పరుగులు ధాటించింది.