
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న రెండో మ్యాచ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) టాస్ ఓడిపోయింది. కేకేఆర్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనూ టాస్ ఓడిన చెన్నై.. మూల్యం చెల్లించుకుంది. తేమ ప్రభావం నేపథ్యంలో టాస్ గెలిచిన జట్లు ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటున్నాయి. చేజింగ్ టీమ్కు డ్యూతో అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోనే ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఐదుసార్లు చేజింగ్ టీమ్సే విజయాన్నందుకున్నాయి.
ఇక జడేజా సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. తాము టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్కు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా మూడు మార్పులు చేసింది. అంతేకాకుండా ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లతోనే బరిలోకి దిగుతుంది. దీనికి గల కారణాన్ని జడేజా టాస్ సందర్భంగా వెల్లడించాడు. తొలి మ్యాచ్ ఆడిన ఆడమ్ మిల్నే పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడని దాంతో అతను ఈమ్యాచ్కు దూరంగా ఉన్నాడని జడేజా చెప్పాడు. ఇక మొయిన్ అలీ అతని స్థానంలో బరిలోకి దిగుతున్నాడని, మిచెల్ సాంట్నర్ స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ను ఆడిస్తున్నామని చెప్పాడు. ఆడమ్ మిల్నే గాయం కారణంగానే మూడు మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు.

ఇక లక్నో జట్టులో కూడా ఓ మార్పు చోటు చేసుకుంది. మోహ్సిన్ స్థానంలో ఆండ్రూ టై బరిలోకి దిగుతున్నాడు. డ్యూ నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని రాహుల్ తెలిపాడు. గత మ్యాచ్లో తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, ఆ విశ్వాసంతో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామని చెప్పాడు. పిచ్ చాలా తాజాగా కనిపిస్తోందని, గ్రాస్ కూడా ఉండటంతో ఆరంభంలోనే వికెట్లు తీసి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టుతామని చెప్పాడ.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నై తొలి మ్యాచ్లో ఓటమితో ప్రస్తుత సీజన్ను ఆరంభించింది. గత సీజన్లోనూ చెన్నై టైటిల్ వేటను పరాజయంతో ప్రారంభించి విజేతగా నిలిచింది. దీంతో ఈ సారి కూడా తమ అభిమాన జట్టు పుంజుకుని రేసులో నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అలానే నయాటీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఓటమితోనే ప్రయాణం మొదలెట్టింది. ఈ క్రమంలో ఇరు జట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు
చెన్నైసూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్) , శివమ్ దూబే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, తుషార్ దేశ్పాండే.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, అయూష్ బదోని, కృనాల్ పాండ్యా, దుష్మంత్ చమీర, ఆండ్రూ టై, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.