ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే పేలవ బౌలింగ్తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వైఫల్యం చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 108 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 66) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లరే 213 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34), దీపక్ హుడా(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో మతీష పతీరణ రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీసారు.
డికాక్ డకౌట్..
211 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(0) డకౌట్గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే కేఎల్ రాహుల్(16)ను ముస్తాఫిజుర్ రెహ్మాన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు మాత్రమే చేసింది.
మార్కస్ స్టోయినీస్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో అతను 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్(13)ను మతీష పతీరణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి నికోలస్ పూరన్తో కలిసి స్టోయినిస్ చెలరేగాడు.
శతక్కొట్టిన స్టోయినీస్..
ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 70 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మతీష పతీరణ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన నికోలస్ పూరన్(34)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి దీపక్ హుడా రాగా.. స్టోయినీస్ తన జోరును కొనసాగించాడు.
ముస్తాఫిజుర్ వేసిన 18వ ఓవర్లో స్టోయినీస్ ఓ సిక్సర్తో పాటు క్విక్ డబుల్ తీసి 56 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. దీపక్ హుడా ఓ సిక్సర్ బాదడంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. చివరి 12 బంతుల్లో లక్నో విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. పతీరణ వేసిన 19వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. దాంతో చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్లో స్టోయినీస్.. వరుసగా 6, 4, 4నోబాల్, 4 బాది మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.