చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపాడు. దాదాపు నాలుగేళ్ల అనంతరం.. 1426 రోజుల తర్వాత చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడిన ధోనీ.. విధ్వంసకర సిక్స్లతో విరుచుకుపడ్డాడు. తనకే సాధ్యమైన షాట్లతో అభిమానులను అలరించాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడు.
ఈ షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోయినా.. ధోనీ బలానికి బంతి బయట పడిపోయింది. ఆ మరుసటి బంతికే మరో సిక్సర్ బాది.. పాత ధోనీని తలపించాడు. ధోనీ కొట్టిన ఈ షాట్కు బంతి 89 మీటర్ల దూరంలో పడింది. మూడో బంతికి మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ధోనీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక ధోనీ ఆడింది మూడు బంతులే అయినా.. తనదైన మార్క్ చూపించాడు. ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో జియో సినిమా వ్యూస్ సంఖ్య కోటీ 80 లక్షలకు చేరింది. ఈ మ్యాచ్ను సగటున కోటీ 50 లక్షల మంది చూడగా.. ధోనీ క్రీజులోకి రాగానే 30 లక్షలకు పెరిగింది.

రెండు వరుస సిక్స్లతో ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్లో 5వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గా ధోనీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ధోనీ ఇప్పటి వరకు 20వ ఓవర్లో 55 సిక్స్లు కొట్టగా.. కీరన్ పొలార్డ్ 33 సిక్స్లు బాదాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 57), డెవాన్ కాన్వే(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 47) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్ సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చెన్నై 24 సార్లు 200 ప్లస్ స్కోర్ చేసింది.
ధోనీ బ్యాటింగ్కు ఫిదా అయిన సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తెలిపాడు. ఇన్నింగ్స్ బ్రేక్లో జియో సినిమాతో మాట్లాడుతూ.. ధోనీ బ్యాటింగ్ చూడ ముచ్చటగా ఉంటుందన్నాడు.