చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఘోర తప్పిదం చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాహుల్.. తమ ప్రధాన పేసర్ అయిన మార్క్వుడ్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో మార్క్వుడ్(5/14) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్ శుభారంభం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అలాంటి బౌలర్ను చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వరకు అతనికి బంతివ్వలేదు. దాంతో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగారు. కైల్ మేయర్స్ వేసిన తొలి ఓవర్లో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లతో 17 పరుగులు పిండుకుంది. మేయర్స్ వేసిన మూడో ఓవర్లో 10 పరుగులు రాగా.. కృనాల్ వేసిన 4వ ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్లో రుతురాజ్ మూడు భారీ సిక్స్లు బాది 20 పరుగులు పిండుకున్నాడు. దాంతో చెన్నై.. ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది.

ఈ పరిస్థితుల్లో రాహుల్.. మార్క్వుడ్ను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. వుడ్ బౌలింగ్లో కాన్వే రెండు బౌండరీలు బాదగా.. గైక్వాడ్ ఓ భారీ సిక్స్ కొట్టాడు. అయితే మార్క్వుడ్తో ముందుగానే బౌలింగ్ వేయించి ఉంటే లక్నోకు శుభారంభం దక్కేదని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. రాహుల్ చేసిన బ్లండర్ మిస్టేక్తో చెన్నై ఓపెనర్లు క్రీజులో సెట్ అయ్యారని చెప్పారు.
క్రికెట్ విశ్లేషకులు సైతం సోషల్ మీడియా వేదికగా ఇదే అభిప్రాయపడ్డారు. ఓ ఎండ్లో గైక్వాడ్తో బౌలింగ్ చేయించి మరో ఎండ్లో ఇతర బౌలర్లతో బౌలింగ్ చేయించాల్సిందన్నారు. అభిమానులు సైతం కేఎల్ రాహుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్తో పాటు కెప్టెన్గానూ రాహుల్ విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు. టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ సైతం రాహుల్ను మందలించాడు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్లో క్లాస్ పీకాడు.
110 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రవి బిష్ణోయ్ ఎట్టకేలకు విడదీసాడు. రుతురాజ్(57)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చగా.. కాన్వే(47)ను మార్క్ వుడ్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(27), మొయిన్ అలీ(19), బెన్ స్టోక్స్(8) విఫలమయ్యారు.