చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సొంతమైదానంలో చివరి మ్యాచ్ ఆడేసింది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. స్లో వికెట్పై బ్యాటింగ్లో తడబడిన ధోనీ సేన.. డ్యూ కారణంగా బౌలింగ్లో తేలిపోయింది. మ్యాచ్ అనంతరం మైదానానికి వచ్చిన తమ ప్రేక్షకులకు బహుమతులు అందజేసింది.
మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ధోనీ సేన.. ఫ్రాంచైజీ టీషర్ట్స్తో పాటు టెన్నిస్ రాకెట్స్, బాల్స్ను గ్యాలరీలోకి విసిరేసింది. ఈ సందర్భంగా అద్భుతమైన దృశ్యం క్రికెట్ అభిమానులను కనువిందు చేసింది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. మహేంద్ర సింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.

సచిన్కు ముందు భారత క్రికెట్ను ఏలిన గవాస్కర్.. ధోనీని అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. గవాస్కర్ విజ్ఞప్తి మేరకు ధోనీ.. తన షర్ట్పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ధోనీ రిటైర్మెంట్ అవుతాడనే ఉద్దేశంతోనే గవాస్కర్ ఈ ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
గవాస్కరే కాకుండా చాలా మంది యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ధోనీ ఆటోగ్రాఫ్లను తీసుకోవడంతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే ధోనీ మరో సీజన్ ఆడుతాడని చెన్నై సూపర్ కింగ్స్ వర్గాలు పేర్కొన్నాయి. అతను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశాయి. వాస్తవానికి సొంత అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకోవాలనుకుంటున్నానని గతేడాది ధోనీ తెలిపాడు.
దాంతో ఈ సీజనే చివరి మ్యాచ్ అని, చెన్నై వేదికగా జరిగే చివరి మ్యాచ్లో అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ సీజన్లో ధోనీ బ్యాట్తో సత్తా చాటడంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వచ్చే సీజన్కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ కోరిక మేరకు ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సీజన్ టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, టైటిల్తో అతనికి వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇలా చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి లీగ్ మ్యాచ్ను ఢిల్లీ వేదికగా మే20న ఆడనుంది.