చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ విఫలమైంది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై కేకేఆర్ స్పిన్నర్లు చెలరేగడంతో చెన్నై బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. శివమ్ దూబే(34 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 48 నాటౌట్) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది.
దూబేకు అండగా రవీంద్ర జడేజా(20) రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు సరైన శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్(17)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రహానే సిక్స్, బౌండరీతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో సీఎస్కే పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం రహానే(16)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సునీల్ నరైన్ తన వరుస ఓవర్లలో అంబటి రాయుడు(4), మొయిన్ అలీ(1)లను పెవిలియన్ చేర్చాడు. ఇద్దర్నీ క్లీన్ బౌల్డ్ చేయడం గమనార్హం. దాంతో 72 పరుగులకే సీఎస్కే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆచితూచి ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న శివమ్ దూబే అనంతరం తనదైన శైలిలో చెలరేగాడు. సుయాశ్ వేసిన 17వ ఓవర్లో మరో రెండు సిక్స్లు బాదిన శివమ్ దూబే.. వరుణ్ చక్రవర్తీ వేసిన 18వ ఓవర్ మరో సిక్సర్ కొట్టాడు.
19వ ఓవర్ను కట్టుదిట్టంగా వేసిన శార్దూల్ ఠాకూర్ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్లో వైభవ్ అరోరా తొలి నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేసి జడేజాను ఔట్ చేశాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి ధోనీ రాగా.. వైడ్, నోబాల్ వేసిన వైభవ్ అరోరా.. ఫ్రిహిట్ బాల్కు క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి ధోనీ డబుల్ తీయడంతో చెన్నై 144 పరుగులు చేయగలిగింది.