చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కేకేఆర్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఓ విచిత్రకరమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
గత ఐదు ఏళ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా నిలిచాడు. గత సీజన్ వరకు చెన్నై సారథిగా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ గత ఐదేళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. 2022 సీజన్లో హాఫ్ సెంచరీ నమోదు చేసినా.. అప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్గా ఉన్నాడు.

ధోనీ సీఎస్కే కెప్టెన్గా 2019 సీజన్లో చివరిసారిగా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ సీజన్లో అతను 3 హాఫ్ సెంచరీలు బాదాడు. ఓవరాల్గా ఇప్పటి వరకు ధోనీ 24 హాఫ్ సెంచరీలతో 5,120 పరుగులు చేశాడు.
2022లో జడేజాకు కెప్టెన్సీ ఇస్తూ సీఎస్కే చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. దాంతో సీజన్ మధ్యలోనే ధోనీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై జట్టును విజేతగా నిలబెట్టాడు.
ఈ సీజన్కు ముందు అనూహ్యంగా సారథ్య బాధ్యతలను వదులుకున్న ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ను సీఎస్కే తదుపరి కెప్టెన్ చేశాడు. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. బ్యాటింగ్కు కఠినంగా ఉన్న పిచ్పై రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
కేకేఆర్తో జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది.
రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్పాండే(3/33) మూడేసి వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించగా.. తీక్షణ ఓ వికెట్ తీసాడు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27), అంగ్క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో9 ఫోర్లతో 672 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్(25), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు.