ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విజయం సాధించింది. బుధవారం కోల్కతా నైట్రైడర్స్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ( 17 నాటౌట్) సిక్స్ బాది చెన్నై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు చివరి 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అజింక్యా రహానే(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఆండ్రీ రస్సెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 38), మనీష్ పాండే(28 బంతుల్లో ఫోర్, సిక్స్తో 36 నాటౌట్) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(4/31) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసి గెలుపొందింది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. అరంగేట్ర ప్లేయర్ ఉర్విల్ పటేల్(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 31), శివమ్ దూబే(40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 45 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(3/48) మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది.
మలుపు తిప్పిన బేబీ ఏబీడీ..
ఈ మ్యాచ్ గెలుపు క్రెడిట్ బేబీ ఏబీ డివిలియర్స్దే. విధ్వంసకర బ్యాటింగ్తో అతను మ్యాచ్ను మలుపు తిప్పాడు. 180 పరుగుల లక్ష్యచేధనలో సీఎస్కేకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు ఆయుష్ మాత్రే(0), డెవాన్ కాన్వే(0) డకౌట్గా వెనుదిరిగారు. అరంగేట్ర ప్లేయర్ ఉర్విల్ పటేల్ మెరుపులు మెరిపించినా.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అశ్విన్(8), జడేజా కూడా నిరాశపర్చడంతో సీఎస్కే 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్.. విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా వైభవ్ అరుణ్ బౌలింగ్లో 3 సిక్స్లు, 3 ఫోర్లతో.. 6 బంతుల్లో 6 బౌండరీలు బాది 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన అతన్ని వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు.
సిక్సర్తో గెలిపించిన ధోనీ..
బ్రెవిస్ ఔటైనా.. గెలుపు ఆశలు రేకెత్తించడంతో శివమ్ దూబే- ధోనీ ఆచితూచి ఆడారు. 19వ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో దూబే, నూర్ అహ్మద్ ఔటవ్వగా.. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. రస్సెల్ వేసిన ఈ ఓవర్ తొలి బంతినే ధోనీ భారీ సిక్సర్ బాది విజయాన్ని ఖాయం చేశాడు. అన్షుల్ కంబోజ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.