ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన ఏకపక్ష మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ ఫలితాన్ని ఇరు జట్ల ఫీల్డింగ్ శాసించింది. పేలవ ఫీల్డింగ్తో తమకు వచ్చిన అవకాశాలను గుజరాత్ టైటాన్స్ చేజార్చుకోగా.. సంచలన ఫీల్డింగ్తో చెన్నై ఘన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 37) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.

మలుపు తిప్పిన రహానే క్యాచ్..
భారీ లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శుభ్మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(21) త్వరగా పెవిలియన్ చేరారు. సాయి సుదర్శన్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా చెన్నై బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ధోనీ స్టన్నింగ్ క్యాచ్కు విజయ్ శంకర్(12) వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
కానీ అజింక్యా రహానే కళ్లు చెదిరే క్యాచ్తో మ్యాచ్ మలుపు తిరిగింది. డేంజరస్ డేవిడ్ మిల్లర్.. రహానే సూపర్ డైవ్ క్యాచ్కు వెనుదిరిగాడు. దాంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. ధాటిగా ఆడే క్రమంలో సాయి సుదర్శన్తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్(11), రాహుల్ తెవాటియా(6), రషీద్ ఖాన్(1) పెవిలియన్ చేరారు. చివర్లో ఉమేశ్ యాదవ్(10 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్(5 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు.