ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తమ హోమ్ గ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడుతోంది. చెపాక్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులంతా వేచి ఉండాలని రిక్వెస్ట్ చేసింది. 'సూపర్ ఫ్యాన్స్ అందరికి ప్రత్యేక విన్నపం. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ వేచి ఉండాలి. మీ అందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం.'అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా అనేక ఊహాగానాలకు తెరలేపింది.

చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో చెపాక్ మైదానం వేదికగా తాను చివరి మ్యాచ్ ఆడుతానని ధోనీ చెప్పడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ధోనీ రిటైర్మెంట్ను ఉద్దేశించే సీఎస్కే ఈ ట్వీట్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.
ధోనీ సతీమణి సాక్షి సింగ్, సురేశ్ రైనాతో పాటు ప్రముఖులు ఈ మ్యాచ్కు హాజరవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అయితే అభిమానులు భయపడినట్లు ధోనీ ఆటకు వీడ్కోలు పలకడని, ప్రతీసారిలానే ఈ సారి కూడా అభిమానులకు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రత్యేకమైన బహుమతులు అందజేసేందుకే ఈ ట్వీట్ చేసిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.
సొంత మైదానంలో చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ఆటగాళ్లంతా మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం సంప్రదాయం. తమకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు టెన్నిస్ బాల్స్, బ్యాట్స్, టీ షర్ట్స్లను వారికి బహుమతులుగా అందజేస్తారు. ఈ సారి కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించేందుకే సీఎస్కే ఈ ట్వీట్ చేసిందని తమిళ మీడియా స్పష్టం చేసింది.