చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టన్నింగ్ క్యాచ్తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ధోనీ తన ట్రేడ్ మార్క్ వికెట్ కీపింగ్తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ తన కీపింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు.
వికెట్ల వెనుకాల ధోనీ స్టన్నింగ్ క్యాచ్కు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్ నిరాశగా వెనుదిరిగాడు. డారిల్ మిచెల్ వేసిన 8వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని మిచెల్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. శంకర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు దూసుకొచ్చింది.

ధోనీ సూపర్ డైవ్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులోనూ.. ధోనీ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడని, అతను మరో రెండేళ్లు ఆడవచ్చని కితాబిస్తున్నారు. వికెట్ కీపింగ్లో ధోనీతో పోటీ పడే ఆటగాడే లేడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 37) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.