
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. అతను మరో రెండు సిక్స్లు కొడితే టీ20ల్లో 300 సిక్స్ల క్లబ్లో చేరుతాడు. ఇప్పటి వరకు 298 సిక్స్లు బాదిన మహీ.. ఢిల్లీతో జరిగే మ్యాచ్లో వీటిని సాధిస్తే ఈ ఫీట్ సాధించిన మూడో భారత క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటికే 361 సిక్స్లతో రోహిత్ శర్మ, 311 సిక్సర్లతో సురేశ్ రైనా ధోనీ కన్నా ముందున్నారు.
ఇక రాజస్థాన్తో జరిగిన గత మ్యాచ్లో చెన్నై ఓడిపోయినప్పటికీ చివర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ధోనీ అభిమానులను అలరించాడు. అయితే అతడు ఏడో స్థానంలో క్రీజులోకి రావడాన్ని గౌతమ్ గంభీర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. ముందుగానే వస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. చెన్నై 217 లక్ష్యంతో బరిలోకి దిగగా.. మహి ఏడో స్థానంలో వచ్చే సరికి అప్పటికే చేయాల్సిన రన్రేట్ భారీగా పెరిగింది. డుప్లెసిస్ సైతం 72 వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో జట్టు 200 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే చివరి ఓవర్లో 38 పరుగులు సాధించాల్సి ఉండటంతో చెన్నై ఓటమి దాదాపు ఖరారైపోయింది. కాగా ఇంగ్లండ్ పేసర్ టామ్ కరన్ వేసిన చివరి ఓవర్లో మహీ రెచ్చిపోయాడు. మూడు బంతుల్లో వరుస సిక్సర్లు బాది 'ఐయాబ్ బ్యాక్'అనే హెచ్చరికను ప్రత్యర్థులకు జారీచేశాడు. ఆ మూడు సిక్సర్లుతో టీ20ల్లో భారత మాజీ సారథి సిక్సర్ల సంఖ్య 298కి చేరింది. ఈరోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్లో మరో రెండు సిక్స్లు కొట్టి 300 క్లబ్లో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.