
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపుతున్నాడు. సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన మహీ.. ఆ తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్లతో తనలోని ఫినిషర్ ఇంకా సజీవంగానే ఉన్నాడని చాటి చెప్పాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ దుమ్మురేపాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చిన మహీ 8 బంతుల్లో 2 సిక్స్లు, ఫోర్తో 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోర్ను 200 ధాటించాడు. ఇందులో ఓ సిక్స్ అభిమానుల మనసులను గెలుచుకుంది.
ఇక ఈ సూపర్ ఇన్నింగ్స్తో మహీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మహీ ఒక్కడికే ఈ ఘనత సాధ్యమైంది. దాంతో మహీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీ20 క్రికెట్లో ధోనీని మించిన ఫినిషర్ లేడని కొనియాడుతున్నారు.
ఇక టీ20ల్లో కెప్టెన్గా 6వేల పరుగుల మైలురాయిని కూడా ధోనీ అందుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు ఈ ఘనతకు 6 పరుగుల దూరంలో నిలిచిన మహీ.. 185 ఇన్నింగ్స్లో కెప్టెన్గా 5994 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లో 21 పరుగులతో ఈ మైలురాయిని ధాటాడు. ధోనీ కన్నా ముందు విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్గా ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (8 బంతుల్లో 2 సిక్స్లు, ఫోర్తో 21 నాటౌట్) సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్(33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 41), శివమ్ దూబే(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) రాణించారు ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.