ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. శనివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. దాంతో 15 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు హ్యాట్రిక్ విజయం. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, బౌలింగ్లో విప్రజ్ నిగమ్ రాణించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ధోనీ, విజయ్ శంకర్ జిడ్డు బ్యాటింగ్ సీఎస్కే పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), ట్రిస్టన్ స్టబ్స్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధోనీ(26 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ముఖేష్ కుమార్ వేసిన రెండో ఓవర్లోనే రచిన్ రవీంద్ర(3) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5)ను మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే డెవాన్ కాన్వే(13)ను విప్రజ్ నిగమ్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలోనే చెన్నై సూపర్ కింగ్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో విజయ్ శంకర్, శివమ్ దూబే ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ దూబే(18)ను విప్రజ్ నిగమ్ క్యాచ్ ఔట్ చేసి సీఎస్కేను కోలుకోలేని దెబ్బతీసాడు. రవీంద్ర జడేజా(2)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో సీఎస్కే 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్లకే టాప్-5 బ్యాటర్లు పెవిలియన్ చేరడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
ధోనీ, శంకర్ జిడ్డు బ్యాటింగ్..
ఆ తర్వాత ధోనీతో కలిసి విజయ్ శంకర్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే విజయ్ శంకర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు అయిపోతున్నా.. ఈ ఇద్దరూ భారీ షాట్లు ఆడకుండా జిడ్డు బ్యాటింగ్తో సీఎస్కే అభిమానులను విసిగించారు. పిచ్ కూడా నెమ్మదిగా మారడంతో బ్యాటింగ్ చాలా కష్టమైంది. తొలి 18 బంతుల్లో ధోనీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. తాను ఎదుర్కొన్న 19వ బంతిని ధోనీ సిక్సర్ బాదాడు. గెలుపు కోసం కాకుండా రన్ రేట్ మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ధోనీ-శంకర్ బ్యాటింగ్ చేసినట్లు అనిపించింది. చివరి ఓవర్లో హిట్టింగ్ చేసిన ఈ ఇద్దరూ పరుగుల వ్యత్యాసాన్ని తగ్గించారు.
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఎవరంటే..?
ఈ మ్యాచ్లో అత్యంత విలువైన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న వికెట్పై కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77)అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు మంచి లక్ష్యాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కారణంగా ఈ పిచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ అదనంగా 25 పరుగులు చేసింది. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సులువు చేసింది.
అతనే అన్సంగ్ హీరో..
ఈ మ్యాచ్లో విప్రజ్ నిగమ్ అన్సంగ్ హీరోగా నిలిచాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన విప్రజ్ నిగమ్ రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు 27 పరుగులే ఇచ్చాడు. పవర్ ప్లేలోనే డెవాన్ కాన్వే(13)ను ఔట్ చేసిన విప్రజ్ నిగమ్.. అనంతరం డేంజరస్ శివమ్ దూబే(18) పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు.
చెలరేగిన కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(0) డకౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చెలరేగాడు. ముఖ్యంగా అభిషేక్ పోరెల్ చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడీని జడేజా విడదీసాడు. అభిషేక్ పోరెల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సమీర్ రిజ్వీతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన రాహుల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 56 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ఖలీల్ అహ్మద్ విడదీసాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ భారీ షాట్లు ఆడాడు. మతీష పతీరణ వేసిన ఆఖరి ఓవర్లో కేఎల్ రాహుల్, అషుతోష్ శర్మ ఔటైనా.. ఢిల్లీకి మంచి లక్ష్యమే దక్కింది.