ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 184 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77)అద్భుత బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది.
అభిషేక్ పోరెల్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), ట్రిస్టన్ స్టబ్స్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలో వికెట్ తీసారు. స్లో వికెట్ అయిన చెన్నై పిచ్పై 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే జేక్ ఫ్రెజర్ మెక్గర్క్(0) డకౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చెలరేగాడు. ముఖ్యంగా అభిషేక్ పోరెల్ చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.
ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడీని జడేజా విడదీసాడు. అభిషేక్ పోరెల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సమీర్ రిజ్వీతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన రాహుల్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ఖలీల్ అహ్మద్ విడదీసాడు.
చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ భారీ షాట్లు ఆడాడు. మతీష పతీరణ వేసిన ఆఖరి ఓవర్లో కేఎల్ రాహుల్, అషుతోష్ శర్మ వరుస బంతుల్లో ఔటయ్యారు. రాహుల్ కీపర్ క్యాచ్గా వెనుదిరగ్గా.. జడేజా సూపర్ త్రోకు అషుతోష్ శర్మ రనౌటయ్యాడు. దాంతో ఆఖరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి.