చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన చెన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరయ్యాయి. 99.9 శాతం ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. చివరి మూడు మ్యాచ్ల్లో ఢిల్లీ గెలిచినా.. ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పాయింట్స్ టేబుల్లో తమ రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ( 9 బంతుల్లో, ఫోర్, 2 సిక్స్లతో 20) శివమ్ దూబే(12 బంతుల్లో 3 సిక్స్లతో 25), అంబటి రాయుడు (17 బంతుల్లో బౌండరీ, సిక్స్తో 23) మెరుపులు మెరిపించారు.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్లకు తలో వికెట్ దక్కింది. చివర్లో ధోనీ ధాటిగా ఆడటం చెన్నైకి కలిసొచ్చింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
రిలీ రోసౌ(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 35), మనీశ్ పాండే(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో మతీశ పతీరణ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కింది.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టిషాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ డేవిడ్ వార్నర్(0) వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే వార్నర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ రాగా.. ఫిల్ సాల్ట్ రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాదాడు. కానీ అతని జోరుకు చాహర్ అడ్డుకట్ట వేసాడు.
స్లోయర్ బాల్తో క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మనీశ్ పాండే కారణంగా మిచెల్ మార్ష్(5) రనౌటయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 3 వికెట్లకు 47 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో రిలీ రోసౌతో కలిసి మనీశ్ పాండే ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ పూర్తిగా డిఫెన్స్కే పరిమితం కావడంతో ఢిల్లీ వేగంగా పరుగులు చేయలేకపోయింది. పతీరణ బౌలింగ్లో మనీశ్ పాండే భారీ సిక్సర్ బాదినా.. ఆ జోరు ఎక్కువసేపు సాగలేదు.
అదే ఓవర్ చివరి బంతికి పతీరణ వేసిన సూపర్ యార్కర్కు మనీశ్ పాండే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే రిలే రోసౌ(35)ను జడేజా పెవిలియన్ చేర్చగా.. 2 బౌండరీలు, సిక్స్తో జోరు కనబర్చిన అక్షర్ పటేల్(21)ను పతీరణ ఔట్ చేశాడు. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. రిపల్ పటేల్(10) కూడా రనౌటవ్వగా.. లలిత్ యాదవ్ను పతీరణ ఔట్ చేశాడు.