
'గురు vs శిష్య:
ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ వికెట్ కీపర్లే.. ఇద్దరూ కెప్టెన్లే.. ఇద్దరూ ఫినిషర్లే. ఇద్దరిలో ఒకరేమో గురువు, మరొకరేమో శిష్యుడు. ధోనీ 3 ఐసీసీ, 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన నాయకుడు కాగా పంత్ ఇప్పుడిప్పుడే జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఎన్నో ఒత్తిడులు, ఓటములు, విజయాలను అందుకున్న అనుభవం ఉంది మహీకి. ఇవేమీ పంత్కు లేదు. ఏఈ నేపథ్యంలో ఈరోజు గురు, శిష్యుల పోరు జరుగుతుండడంతో అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆసక్తికరంగా ఉన్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఈ పోరుపై ఓ కన్నేశాడు. 'గురు vs శిష్య.. ఈరోజు అసలైన మజా వస్తుంది! స్టంప్ మైక్ తప్పకవినండి' అంటూ ట్వీట్ చేశాడు.

ధోనీసేనదే పైచేయి:
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికరమైన పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడ్డాయి. వీటిలో 15 విజయాలతో ధోనీసేనదే పైచేయి. మరోవైపు ఢిల్లీ 8 గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా చివరి ఐదు మ్యాచులు మాత్రం హోరాహోరీగా సాగాయి. 2020లో రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ విజయ దుందుభి మోగించింది. 2019లో పూర్తిగా ధోనీసేనదే ఆధిపత్యం. రెండు లీగు మ్యాచులు, రెండో క్వాలిఫయర్లో ఢిల్లీని చిత్తు చేసింది. మరి ఈరోజు ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

పటిష్ఠంగా ఢిల్లీ:
ప్రస్తుతం యువకులు, సీనియర్లతో ఢిల్లీ పటిష్ఠంగా ఉంది. జట్టు కూర్పు, కోచింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఆటగాళ్లంతా జోరు మీదున్నారు. ఇంగ్లండ్ వన్డేల్లో శిఖర్ ధావన్ దంచికొట్టాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా వీరోచిత ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారేలో 4 శతకాలతో 827 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై పరుగుల వరద పారించాడు. గతేడాది రాణించిన స్టోయినిస్, హెట్మైయిర్కు ఈసారి సామ్ బిల్లింగ్స్ జత కలిశాడు. జింక్య రహానే, స్టీవ్ స్మిత్ ఉండనే ఉన్నారు. కాగిసో రబాడా, ఆన్రిచ్ నోర్జె గతేడాది లానే నిప్పులు చేరిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బహుశా వారు తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, క్రిస్ వోక్స్ మ్యాచ్ ఆడనున్నారు. కరోనాతో అక్షర్ పటేల్ ఐసోలేషన్లో ఉండటంతో స్పిన్ విభాగంలో ఆర్ అశ్విన్ కీలకమవుతాడు.

చెన్నైకి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు:
కాగితంపై చెన్నై బలంగా కనిపిస్తున్నా బరిలోకి దిగాక ఎలా ఉంటుందో తెలియదు. ఎంఎస్ ధోనీకి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. జడేజా ఇప్పుడే మైదానంలో అడుగుపెట్టాడు. సురేశ్ రైనా రాకతో జట్టు బలం పెరిగింది. అంబటి రాయుడు ఆడితే తిరుగులేదు. కానీ వీరిద్దరూ జనవరిలో ఆఖరి మ్యాచ్ ఆడటం గమనార్హం. డుప్లెసిస్ చివరగా పీఎస్ఎల్లో ఆడాడు. డ్వేన్ బ్రావో పరిస్థితీ అంతే. మొయిన్ అలీ టీమ్ఇండియా సిరీస్కు ఎంపికైనా తుది జట్టులో సరైన అవకాశాలు రాలేదు. సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ మాత్రమే ఫామ్లో ఉన్నారు. దీపక్ చహర్, కృష్ణప్ప గౌతమ్ ఎలా ఆడతారో చూడాలి.

తుది జట్లు (అంచనా) :
చెన్నై: రాబిన్ ఊతప్ప/ రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్.
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్ (కెప్టెన్), మార్కస్ స్టొయినిస్, శిమ్రాన్ హెట్మైయిర్, క్రిస్ వోక్స్ /టామ్ కరన్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ.
MI vs RCB: ఐపీఎల్ 2021 సీజన్ మొత్తంను అతడినే కొనసాగిస్తా: కోహ్లీ


Click it and Unblock the Notifications












